టీజీ ఐసెట్ పరీక్ష తొలిరోజు ప్రశాంతం

టీజీ ఐసెట్ పరీక్ష తొలిరోజు ప్రశాంతం

నల్గొండ అర్బన్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్–2025 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రెండు విడతల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు 93 పరీక్షా కేంద్రాల్లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 91 పరీక్షా కేంద్రాల్లో రెండు విడతలుగా నిర్వహించారు.

మొదటి విడతలో 24,330 మంది అభ్యర్థులకు గాను 21,897 (90 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 24,330 మంది అభ్యర్థులకు గాను 22,136(90.98 శాతం) మంది హాజరయ్యారని ఐసెట్ కన్వీనర్ అలువాల రవి తెలిపారు. మొదటి విడత ప్రశ్నపత్రాల సెట్​ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, ఆచార్య మహమూద్, సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్, టీజీ ఐసెట్ చైర్మన్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అలువాల రవితో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి కామన్ ఎంట్రన్స్ లను నిర్వహించే శక్తి సామర్థ్యాలను ఎంజీయూ సొంతం చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. కాగా, బాలకిష్టారెడ్డి హైదరాబాద్​లోని వివిధ పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. సెట్ చైర్మన్ ఆచార్య ఖాజా అల్తాఫ్​, వైస్ చైర్మన్ లు వివిధ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ సరళిని సమీక్షించారు.